నిశ్శబ్దంలో 'అయోధ్య'
By Medi Samrat Published on 8 Nov 2019 6:05 AM GMTముఖ్యాంశాలు
- 17లోగా తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు
- మొహరించిన పారా మిలటరీ బలగాలు
అయోధ్య వివాదం చివరి అంకానికి చేరుకున్న నేఫథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రామమందిర నిర్మాణం కోసం అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కిస్తున్న విశ్వహిందూ పరిషత్ ఆ పనులను నిలిపివేసింది. మరోవారంలో తీర్పు వెలువడనున్న నేఫథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది.
ముందస్తు చర్యల్లో భాగంగా ఫైజాబాద్ జిల్లాకు 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144 సెక్షన్ విధించింది. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అయోధ్య వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో అంతా సవ్యంగానే జరిగిపోతుందని, 1992 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తుంది. గతంలో కేంద్రం, యూపీలో ప్రభుత్వాలు మారినా.. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంస్థలపై 6 నెలలపాటు నిషేధం విధించినప్పుడు కూడా ఈ పనులు ఆగలేదు.
తాజాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా తమ నాయకత్వం పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వీహెచ్పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ముందుగా అనుకున్నట్టుగా రామమందిరం మొదటి అంతస్తుకు సంబందించి రాతి చెక్కడం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని తెలిపారు.