కొత్త ఫోన్లలో 'ఆధార్' యాప్.. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మొబైల్‌ కంపెనీలు.. ఎందుకంటే?

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రతిపాదన మేరకు, దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని...

By -  అంజి
Published on : 20 March 2026 9:32 AM IST

Aadhaar App Pre-installation, Smartphone Makers Push Back, UIDAI Proposal, Privacy and Security Concerns, Apple and Samsung Opposition, Sanchar Saathi Mandate

కొత్త ఫోన్లలో 'ఆధార్' యాప్.. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మొబైల్‌ కంపెనీలు

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రతిపాదన మేరకు, దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ కంపెనీలను కోరింది. ఫోన్ కొన్నప్పుడు క్లాక్ లేదా క్యాలిక్యులేటర్ యాప్స్ ఎలాగైతే వస్తాయో, ఆధార్ యాప్ కూడా అలాగే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల పౌరులు అదనంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే పనిలేకుండా సులభంగా ఆధార్ సేవలు పొందవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు 'మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' (MAIT) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఫోన్లలో ప్రభుత్వ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల వినియోగదారుల భద్రత, గోప్యత (Privacy) దెబ్బతినే అవకాశం ఉందని ఈ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, భారతదేశం కోసం ప్రత్యేక ప్రొడక్షన్ లైన్లను నిర్వహించడం వల్ల లాజిస్టికల్ ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చదని కంపెనీలు స్పష్టం చేశాయి. కొన్ని వారాల క్రితమే 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్‌ను కూడా ఇలాగే ముందే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మొబైల్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఇప్పుడు ఆధార్ యాప్‌తో పాటు విపత్తు హెచ్చరికలు చేసే 'సచేత్' (Sachet) వంటి మరో ఐదు ప్రభుత్వ యాప్‌ల విషయంలోనూ ఇదే తరహా చర్చలు జరుగుతున్నాయి. రష్యా మినహా ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలా ప్రభుత్వ యాప్‌లను మొబైల్స్‌లో తప్పనిసరి చేయడం లేదని కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆధార్ యాప్ విషయంలో కేవలం 'అభ్యర్థన' మాత్రమే చేసింది తప్ప, 'ఆదేశం' జారీ చేయలేదని సమాచారం. ఆధార్ డేటా లీక్‌లపై గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో, ప్రైవసీ విషయంలో రాజీ పడకూడదని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మరియు టెక్ కంపెనీల మధ్య జరుగుతున్న ఈ చర్చలు త్వరలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Next Story