రేపటి నుంచి విధుల్లో చేరుతామని చెప్పడం హస్యాస్పదంగా ఉంది: ఆర్టీసీ ఎండీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 2:23 PM GMT
రేపటి నుంచి విధుల్లో చేరుతామని చెప్పడం హస్యాస్పదంగా ఉంది: ఆర్టీసీ ఎండీ

రేపటి నుంచి విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ అన్నారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెప్పడమేంటన్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదని, ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదని గుర్తు చేశారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారన్నారు. కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని, ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారని, దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు.

అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని మరోమారు స్పష్టం చేశారు. తమంతటా తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని, కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని పేర్కొన్నారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని సూచించారు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరుతున్నానని అన్నారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదని అన్నారు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టుకు కూడా తెలియ చేయడం జరుగుతుందన్నారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నానని అన్నారు.

Next Story