ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టు
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Oct 2019 7:15 AM GMTహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సుందరయ్య విజ్ఞానభవన్ పార్కు సమీపంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ సహ, కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను కోరారు. సమ్మె విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం కార్మిక లోకమంతా ఉద్యమం చేయడం మంచి పరిణామమని అన్నారు. గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీఎం కేసీఆర్కు కార్మిక చట్టాల గురించి తెలియకపోవడం బాధాకరమని చెప్పారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే పదం రాజ్యాంగంలో లేదని పద్మనాభన్ గుర్తు చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆరే ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తానంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.