ఎన్టీఆర్కు అన్యాయం జరుగుతోంది..!
By అంజి Published on 8 Feb 2020 3:23 AM GMTనట రుద్రుడు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ కోసం దర్శక దిగ్గజం రాజమౌళి క్యాంపులో ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. చిత్ర బృందం తాజాగా ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు రెండేళ్లపాటు వీరు అజ్ఞాతవాసం చేయనున్నారు. దీంతో వారి కెరీర్లో ఈ రెండేళ్ల కాల్షీట్లు ఖర్చైపోయినట్టే. కాకపోతే ఇక్కడ చెర్రీ కంటే ఎన్టీఆర్కే ఎక్కువ అన్యాయం జరుగుతుందంటూ టాలీవుడ్ సర్కిల్స్లో తెగ ప్రచారం జరిగిపోతుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దర్నీ డీల్ చేయడంలో రాజమౌళి కాస్త పక్షపాతం చూపిస్తున్నారన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్ల నిడివి ఎంతన్నది రాజమౌళికి తప్ప మరెవ్వరికి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇటీవల రామ్ చరణ్ తీరు చూస్తుంటే మాత్రం చిత్ర బృందంలో తానొక్కడే షూటింగ్కు దూరంగా ఎక్కువ సమయం గడిపినట్టు తెలుస్తుంది.
అంతేకాకుండా, గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన రామ్ చరణ్ ఎక్కువగా ఔటింగ్లోనే గడిపాడు కూడా. సైరా ప్రమోషన్స్ కోసమంటూ ఆర్ఆర్ఆర్కు ఏకంగా మూడు నెలలు దూరమయ్యాడు. అలాగే చిరు, కొరటాల శివ మూవీలోనూ ఈ మెగా పవర్ స్టారే కీలకంగా వ్యవహరించనున్నారు. 2019 టాలీవుడ్ క్యాలెండర్లో చరణ్ పేరు మీద ఒక పెద్ద సినిమా రిలీజ్ ఉంది కూడా.
ఏదేమైనా ఆర్ఆర్ఆర్ లొకేషన్ నుండి రామ్ చరణ్ ఇచ్చిన వెసులుబాటు తారక్కు లేకుండా పోయిందన్నది వాస్తవం. 2019 క్యాలెండర్లోనూ తారక్ అప్పీయరన్స్ ఎక్కడా కనిపించలేదు. 2018 దసరా కానుకగా రిలీజైన అరవింద సమేతనే తారక్ చివరి సినిమాగా ఉండిపోయింది. ఆ తరువాత తారక్ ఎక్కడా కనిపించలేదు.
మరోవైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో తారక్ మరో మూవీ కమిట్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే త్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మారిపోవడంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో వాయిదా పడుతూ వస్తోంది. ఏదేమైనా ఈ ఏడాది డిసెంబర్లోపు త్రిపుల్ ఆర్కు ఫుల్స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో తారక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎంచక్కా బయట తిరిగేస్తున్న చెర్రీని చూసిన సినీ జనాలు చెర్రీకో న్యాయం.. ఎన్టీఆర్కో న్యాయమా..? అంటూ రాజమౌళిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.