'రోహిత్' కళ్లుచెదిరే క్యాచ్.. బిత్తరపోయిన కోహ్లీ..!
By Medi Samrat Published on 22 Nov 2019 12:10 PM GMTముఖ్యాంశాలు
- పింక్బాల్ టెస్ట్ లో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్
- బిత్తరపోయిన కింగ్ కోహ్లీ
- టీమ్లో జోష్ నింపిన రోహిత్ క్యాచ్
బంగ్లాతో జరిగిన గత టెస్ట్ మ్యాచ్లో ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ను సెకండ్ స్లిప్లో జారవిడచడంతో అసహనానికి గురైన రోహిత్.. ఇన్నింగ్స్ బ్రేక్లో స్లిప్ క్యాచ్లను ప్రాక్టీస్ చేసి మరీ దాన్ని అధిగమించాడు. అనంతరం మహ్మదుల్లా క్యాచ్ను అద్భుతంగా పట్టి శభాష్ అనిపించాడు. ప్రాక్టీస్ కారణంగా ఎటువంటి తప్పిదం లేకుండా అందుకున్నాడు.
అయితే.. తాజాగా ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రోహిత్ మళ్లీ తన ఫీల్డింగ్తో అదరగొట్టాడు. సెకండ్ స్లిప్లో డైవ్ కొట్టి మరీ క్యాచ్ను అందుకుని ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. బంగ్లా ఇన్నింగ్స్ 11 ఓవర్ లో ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతిని బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని స్లిప్లోకి వెళ్లింది. ఆ క్రమంలోనే ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి ఆ క్యాచ్ పట్టుకోడానికి సిద్దం కాగా, సెకండ్ స్లిప్లో ఉన్న రోహిత్ ఒక్కసారిగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దాంతో బంగ్లా కెప్టెన్ ఇన్నింగ్స్ సున్నాకే ముగిసింది.
కాగా, రోహిత్ క్యాచ్తో కోహ్లీ బిత్తరపోయాడు. కానీ.. రోహిత్ క్యాచ్ పట్టిన తీరు మాత్రం టీమిండియా కెప్టెన్ కోహ్లితో పాటు జట్టులోని ఆటగాళ్లలో జోష్ నింపింది. ఇదిలావుంటే.. పింక్బాల్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అల్ అమీన్ బౌలింగ్లో మెహిదీ హసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు.