ఈడెన్ వేదికగా చారిత్రాత్మక 'పింక్ బాల్' సమరం
By Medi Samrat Published on 22 Nov 2019 7:30 AM GMTముఖ్యాంశాలు
- భారత్ - బంగ్లా జట్ల మధ్య పోరు
- చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో సమరం
- గంగూలీ బీసీసీఐ అధిపతి కాగానే తొలినిర్ణయం
ప్రతిష్టాత్మక 'పింక్ బాల్' టెస్ట్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ డే అండ్ నైట్ టెస్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోల్కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.
ఇదిలావుంటే.. అంతర్జాతీయ క్రికెట్లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ప్రస్తుతం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టాకనే ఇండియాలో డే- నైట్ టెస్టుల నిర్వహణ కార్యరూపం దాల్చింది.
ఇకపోతే.. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా డే - నైట్ టెస్ట్ ఆడాలని ఆహ్వానించినప్పటికీ బీసీసీఐ తిరస్కరించింది. అయితే, ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టడం.. టీమిండియా సైతం డే- నైట్ టెస్ట్ ఆడతామని అంగీకరించడంతో అతి తక్కువ సమయంలోనే ఈ డే- నైట్ టెస్ట్కు ఈడెన్ గార్డెన్స్ ముస్తాబైంది.
కాగా, నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి డే- నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత జట్టు తరుపున టెస్ట్ క్రికెట్ కు ప్రాతినిథ్యం వహించిన హేమాహేమిలందరిని బీసీసీఐ, క్యాబ్ ఈ మ్యాచ్కు ఆహ్వానించింది.
ఇండియాలో మొదటి డే నైట్ టెస్టు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావించింది. ఇప్పటికే కోల్కతాలోని వీధులన్నీ గులాబీమయం అయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో డే నైట్ టెస్టు ఆడిన 9, 10వ జట్లుగా భారత్, బంగ్లాదేశ్లు నిలువనున్నాయి. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే డే నైట్ టెస్టు మ్యాచ్ 12వది కావడం విశేషం.