తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..ఆరుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 5:21 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..ఆరుగురు మృతి

ఏపీ, తెలంగాణ: వైఎస్సార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు తప్పింది. దీంతో కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకు సహా కారు డ్రైవర్‌ ఉన్నాడు. వీరంతా నందలూరు మండలం నీలిపల్లె గ్రామస్తులుగి తెలిసింది. కడప నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు దాసరి మణెమ్మ (45), పవన్‌ కల్యాణ్‌ (25), సాయి కిరణ్‌, (19), )గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.

డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

విజయవాడ గుణదల సమీపంలో ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిన బస్సును పోలీసులు క్రేన్‌ సాయంతో పక్కకి తొలగించారు. గాయపడిన ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో​ ముగ్గురు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story