ఆర్జీవీ మ‌మ్మ‌ల్నీ సంప్ర‌దించ‌లేదు : ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 12:15 PM GMT
ఆర్జీవీ మ‌మ్మ‌ల్నీ సంప్ర‌దించ‌లేదు : ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ మర్డర్‌’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో..‌ ప్రణయ్‌-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య‌, త‌ద‌నంత‌రం మారుతీరావు ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఈ సినిమా తీయనున్నట్టు అర్థమౌతోంది. అయితే వ‌ర్మ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌పై అమృత స్పందించిన‌ట్టుగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఫేస్‌బుక్ ఫోస్ట్‌ ప్ర‌కారం.. ‘‘ పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్‌ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎరికీ తెలియదు. గర్వంతో, పరువుపోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఏదో అలా కాలం వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. రామ్‌గోపాల్‌ వర్మ పోస్టర్‌ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికి పోయాను. నా కొడుకుని చూసుకుంటూ, ఉన్నంతలో ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నాను . ఇంతలో సమాజం కళ్లన్నీ మరోసారి నాపై పడేలా రామ్‌గోపాల్‌ వర్మ చేస్తున్నాడు. ‘‘నువ్‌ విడుదల చేసిన పోస్టర్‌ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను.ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌’’ అని అమృత ఓ ప్రకటన చేసిన‌ట్టుగా చీరాల స‌మాచారం అనే ఫేస్‌బుక్ పేజీలో ఓ క‌థ‌నం వైర‌ల్ అవుతుంది.

అయితే.. న్యూస్‌మీట‌ర్‌తో మాట్లాడిన ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి.. మ‌ర్డ‌ర్ సినిమా ప‌స్ట్‌లుక్ విడుద‌ల విష‌య‌మై ద‌ర్శ‌కుడు మా ఫ్యామిలీతో ఎటువంటి సంప్ర‌దింపులు చేయ‌లేద‌ని అన్నారు. మేమింకా కొడుకు చ‌నిపోయిన బాధ‌లోనే ఉన్నామ‌ని.. అమృత‌కు న్యాయం జ‌ర‌గ‌డం కోసం పోరాటం చేస్తామ‌ని అన్నారు. ద‌ర్శ‌కుడు ఎందుకు సినిమా చేస్తున్నాడో తెలియదని.. సోష‌ల్ మీడియాలో అమృత చేసిన‌ట్టుగా వ‌స్తున్న క‌థ‌నాలు పూర్తిగా క‌ల్ఫితాల‌ని అన్నారు.

Next Story