బెయిల్‌ నిరాకరించిన కోర్టు.. చర్లపల్లి జైల్లో ఎంపీ రేవంత్‌..

By అంజి  Published on  11 March 2020 11:19 AM GMT
బెయిల్‌ నిరాకరించిన కోర్టు.. చర్లపల్లి జైల్లో ఎంపీ రేవంత్‌..

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగరవేసిన కేసులో రేవంత్‌కు బెయిల్‌ను నిరాకరించింది. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ఇరు పక్షాల వాదనలు మంగళవారం పూర్తి అయ్యాయి. నిన్న రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో మెజిస్ట్రేట్‌ లేని కారణంగా బెయిల్‌ పిటిషన్‌ విచారణను కూకట్‌పల్లి కోర్టుకు బదిలీ చేశారు. కాగా ఇవాళ తీర్పును వెలువరించింది.

జన్వాడలోని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరా ఎగరవేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి ఉన్నారు. కాగా ఈ కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.

ఈ నెల 6న రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో 8 మందిని నిందితులుగా అనుమానిస్తూ నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ వాడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌విత్‌ 5ఏ, ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. గత విచారణలో రాజేంద్రనగర్‌ కోర్టు ఆరుగురికి బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కావాలనే రేవంత్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు.

Next Story