తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్పై మరోసారి మండిపడ్డ మత పెద్దలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Oct 2019 6:14 AM GMTకోల్ కతా: తనపై వస్తున్న విమర్శలను అసలు పట్టించుకోను అన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్. ఈ ఏడాది దుర్గ పూజ ఉత్సవాలలో పాల్గొన్న ఆమెపై ఇస్లాం మతాధికారులు చేసిన విమర్శలకు స్పందించారు. ఈ దేశంలో అన్ని మతాలకు చెందిన ప్రజలను తాను గౌరవిస్తానన్నారు. తాను దేవుని ప్రత్యేకమైన పుత్రికను అన్న నస్రత్ ..అన్ని పండుగలనూ జరుపుకుంటానని చెప్పారు.
కొల్కతాలోని దుర్గ మండపాల దగ్గర జరిగిన సింధూర్ ఖేలాలో తన భర్త నిఖిల్ జైన్తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెంగాలీ మహిళలు దుర్గమ్మ నుదుటిపైనా.. పాదాలకు సింధూరం పూసి, దేవతామూర్తి కి మిఠాయి తినిపిస్తారు. తర్వాత మహిళలు ఒకరికొకరు సింధూరం పూసుకొని ఆనందంగా గడుపుతారు. రాజకీయ నేతగా మారిన నటి నుస్రత్ జైన్ పారిశ్రామికవేత్త అయిన నిఖిల్ జైన్ ను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వచ్చిన మొదటి దుర్గ పూజ కావడంతో ఆమె సంప్రదాయ దుస్తులలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఇస్లాంను, ముస్లింలను అగౌరవపరుస్తోందని మరోసారి మత పెద్దలు మండిపడ్డారు. ఆమె తన పేరును మతాన్ని మార్చుకోవాలని సూచించారు.