చ‌ర‌ణ్ ఇంకో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడా.. ఇంత‌కీ.. హీరో ఎవ‌రు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 9:03 AM GMT
చ‌ర‌ణ్ ఇంకో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడా.. ఇంత‌కీ.. హీరో ఎవ‌రు..?

కొణిదెల ప్రొడ‌క్ష‌ణ్ కంపెనీ బ్యాన‌ర్ ను స్టార్ట్ చేసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్... తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం. 150 సినిమాని నిర్మించ‌డం.. విజ‌యం సాధించ‌డం తెలిసిందే. తాజాగా ఈ బ్యాన‌ర్ లో భారీ బ‌డ్జెట్ తో.. భారీ తారాగ‌ణంతో 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమాని నిర్మించారు. చిరంజీవి, అమితాబ్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఒక వైపున హీరోగా విభిన్నమైన చిత్రాల్లో న‌టిస్తూనే, మరో వైపున నిర్మాతగా చరణ్ భారీ చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. సైరా త‌ర్వాత‌ చరణ్ మరో భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు.. దీని కోసం రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న‌ట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన చిత్రం లూసిఫర్.

ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచింది ఈ సినిమా. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నార‌ట‌. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఈ మూవీని చిరుతో చేస్తాడా..? లేక ప‌వ‌న్ తో చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది.

Next Story