మాహిష్మతిలోనూ మాస్కులు కంపల్సరీ.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 9:59 AM GMT
మాహిష్మతిలోనూ మాస్కులు కంపల్సరీ.. వీడియో వైరల్‌

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 97 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 5లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే శానిటైజర్లు, మాస్కులు వాడడంతో పాటు భౌతికదూరం తప్పనిసరి.బయటికి వెళ్తే.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్కుల అవసరాన్ని తెలియజేస్తూ.. దర్శకదీరుడు రాజమౌళి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

'బాహుబలి-2' చిత్ర క్లైమాక్స్‌లో ప్రభాస్‌, రానాలు పోరాడుతున్న వీడియో అది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉండాలని బావిస్తున్నా అని రాజమౌళి ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోను వీఎఫ్ఎక్స్‌ సూడియో టీమ్‌ తయారు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌, రానాలు ఇద్దరూ ఈ వీడియోలో మాస్కులు పెట్టుకుని కనిపిస్తున్నారు.

'బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. మాహిష్మతి సామ్రాజ్యం, యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఓ విజువల్‌ వండర్‌ గా తీర్చిదిద్దాడు రాజమౌళి. రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక రాజమౌళి ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్'‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.



Next Story