అర్ధరాత్రి వేళ దడ పుట్టించిన జడివాన
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Sep 2019 6:32 AM GMTహైదరాబాద్: రోజూ పలకరిస్తున్న వాన గురువారం సాయత్రం వరకూ రాకపోవడంతో హైదరాబాద్ వాసులందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 11గంటల సమయంలో మొదలైన వాన.. రెండు, మూడు గంటల పాటు ఆగకుండా దంచికొట్టింది. అంతే..మరోసారి హైదరాబాద్ అతలాకుతలమైంది. . నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుడిమల్కాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 14.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇక ..మెహదీపట్నం, ఖైరతాబాద్, మోండా మార్కెట్, నాంపల్లి, బేగంబజార్, ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాదాపు 100కు పైగా బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు అధికారులు అంచానా వేశారు. నగరంలో ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్ట వద్ద వర్షపు నీరు రహదారులను ముంచెత్తింది. రాజ్ భవన్ రోడ్ లో కూడా భారీగా వాన నీరు వచ్చి చేరి..చెరువును తలపించింది.
వరద నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. నాలాల నుంచి వర్షం నీరు హుస్సేన్ సాగర్ రకు కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్లోకి చేరుతుండడం.. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా నిన్ననే సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కానీ.. వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం భాగ్యనగర్ వాసులకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టు అని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన జిహెచ్ఎంసి సిబ్బంది వరద నీటిని క్లియర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కానీ, కుండపోతగా పడుతున్న వానలు పజల్నే కాదు అధికారులని కూడా బెంబేలెత్తిస్తున్నాయి.