పరుగుల వరద పారిస్తున్న జూనియర్ ద్రావిడ్..
By Newsmeter.Network Published on 26 Feb 2020 5:48 AM GMTటీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుంటున్నాడు. బ్యాటింగ్లో అలవోకగా శతకాలు బాదేస్తున్న ఈ జూనియర్ వాల్.. ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. అండర్-14 విభాగంలో ఇప్పటికే రెండు ద్విశతకాలతో రాణించిన జూనియర్ ద్రావిడ్.. తాజాగా జరిగిన మ్యాచ్లో భారీ శతకం బాదడంతో పాటు బౌలింగ్లో విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టి.. జట్టు సెమీఫైనల్ చేరడంతో కీలక పాత్ర వహించాడు.
అండర్-14 బీటీఆర్ షీల్డ్ టోర్నమెంట్లో విద్యాషిల్స్ అకాడమీతో జరిగిన మ్యాచ్లో శతకంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన మాల్యా జట్టు.. సమిత్ ద్రవిడ్(166; 131 బంతుల్లో 24పోర్లు) భారీ శతకంతో రాణించడంతో.. 50 ఓవర్లలో 5 వికెట్టు నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం 331 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన విద్యాషిల్స్ 38.5 ఓవర్లలో 182 పరుగలకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్లో సమిత్ 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. దీంతో మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల సెమీస్కు చేరింది. అంతకముందు ఇదే టోర్నమెంట్లో సమిత్.. ద్విశతకం బాదాడు. శ్రీకుమారన్ జట్టుపై 33 బౌండరీలు బాది 204 పరుగులు చేశాడు.