'రాగల 24 గంటల్లో' సెన్సార్ పూర్తి..
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 12:38 PM GMTసత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం 'రాగల 24 గంటల్లో'. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 15న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నవంబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పని చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుందన్నారు.
నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ.. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. నవంబర్ 15న 'రాగల 24 గంటల్లో' వంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను తొలి చిత్రంగా ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారాన్ని అందించారు. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.