టీఆర్ఎస్ Vs బీజేపీ.. తెలంగాణలో కొత్త రాద్ధాంతం
By సుభాష్ Published on 20 Feb 2020 8:17 AM GMTతెలంగాణలో ఇప్పుడు కొత్త రాద్ధాంతం మొదలైంది. అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు అభివృద్ధి, ఇతర అంశాలపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటే ఇప్పుడు మర్యాద లొల్లి వచ్చిపడింది. మాకు తగిన మర్యాద ఇవ్వడం లేదంటే.. మాకు తగిన మర్యాద ఇవ్వడం లేదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇంకో వైపు నిధుల కేటాయింపులపై కూడా రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రోటోకాల్ అంశం సెగలు రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో మెట్రో ప్రారంభానికి నన్ను ఆహ్వానించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉండగా, అందుకు టీఆర్ఎస్ ఖండించింది. ఇక గత రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్న కార్యక్రమ ఆహ్వాన పత్రికలో నా పేరు లేదంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెట్రో రైలు ప్రారంభోత్సవానికి నన్న ఆలస్యంగా పిలిచారని, కనీస మర్యాదలు కూడా ఇవ్వడం లేదని మంత్రి కిషన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత కిషన్రెడ్డి మెట్రోలో ప్రయాణించి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే చర్లపల్లి స్టేషన్ను శాటిలైట్ టెర్మినల్గా మార్చే కార్యక్రమంలో నన్ను పిలవలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అంతేకాదు ఆహ్వానపత్రికలో తన పేరే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనుకుంటే ఈ విషయంపై రాజకీయం చేయవచ్చు.. కానీ తాము అలా చేసే వ్యక్తులకు కాదని తలసాని స్పష్టం చేశారు. కాగా, అంతేకాదు మెట్రో ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి తానే స్వయంగా ఫోన్ చేసి పిలిచానని క్లారిటీ ఇచ్చారు తలసాని. ఇలా మర్యాద ఇవ్వడం లేదని ఒకరిపై ఒకరి మాటల యుద్ధం కొనసాగుతోంది.