ప్రశాంత్ కిషోర్కు జెడ్ కేటగిరీ భద్రత.. ఎందుకో తెలుసా..?
By అంజి Published on 18 Feb 2020 5:09 AM GMTపశ్చిమబెంగాల్: ఎన్నికల వ్యూహాకర్త, ఐఫ్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్కు మమతా బెనర్జీ సర్కార్ జడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. పీకేకు జడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సెక్రటెరేయట్ వర్గాలు అంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ.. పీకేను తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకుంది. ఈ నేపథ్యంలోనే పీకేకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా పీకేకే జడ్ కేటగిరీ భద్రతపై రాజకీయ నాయకుడు, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయనకు భద్రత కల్పించడమేంటని ఆయన ట్వీట్ చేశారు. ఇద్దరు వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఒక ఎస్కార్ట్ సహా అవసరాన్ని బట్టి స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్కు కేటాయించిన భద్రతపై బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. పీకే గతంలో బీజేపీకి కూడా ఎన్నికల వ్యూహాకర్తగా పని చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెల్లడి అవుతాయని వెస్ట్బెంగాల్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పీకే ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేశారు. ఢిల్లీలో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ పార్టీ గెలుపునకు పీకే.. తన మాస్టర్ ప్లాన్ను అమలు చేశారు. ప్రస్తుతం పీకే, తన బృందం.. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్కు జడ్ కేటగిరీ భద్రతపై ఇంకా స్పందించలేదు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం లేదన్న కారణంతో ప్రశాంత్ కిషోర్ను జేడీయూ పార్టీ బహిష్కరించింది.