రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పించాలి: మంత్రి కేటీఆర్

రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్‌ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  22 Oct 2023 11:45 AM GMT
Minister ktr,  tpcc chief, revanth reddy, politics,

రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పించాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేసిన నిప్పురాజుకునేలా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. దానికి తగినట్లుగానే అధికార పార్టీ నాయకులూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిందనే చెప్పాలి. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జి ప్రమాదానికి గురికావడంతో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఆయుధం దొరికినట్లు అయ్యింది. దాంతో బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్‌ అయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి జానారెడ్డికి సంస్కారం నేర్పించాలని సూచించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌కు పిండం పెట్టాలన్నప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ జల విహార్‌లో బీఆర్ఎస్‌ ఇన్‌చార్జిలు, వార్‌రూమ్ సభ్యులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతల వద్ద తమకు సంస్కారం నేర్చుకోవాల్సిన ఖర్మ లేదని చెప్పారు. రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్సే అంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని.. అంతేకాదు ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత ఎన్నికల కంటే బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలవబోతుందని మంత్రి కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్‌ కొట్టి.. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. బీజేపీ వంద స్థానాల్లో అభ్యర్థులే లేరని.. ఇక కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story