కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసి.. రుణమాఫీ చేస్తోంది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2024 7:00 AM GMT
brs, ktr,  crop loan waiver, congress govt, telangana ,

 కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసి.. రుణమాఫీ చేస్తోంది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ అంటూ అకౌంట్లలో జమ చేస్తున్న డబ్బుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు కింద జూన్‌ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే రూ.7వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని కేటీఆర్ అన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి.. రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులిస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

అలాగే రుణమాఫీ కోసం రైతుల ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లక్షల పైచిలుకు రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్‌ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులనే అర్హులుగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. 2014లోనే కేసీఆర్ సర్కార్‌ లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. అప్పుడే 35 లక్షల మంది రైతులు లబ్ధిపొందారని అన్నారు. ఇక 2018లో రూ.లక్ష లోపు రుణమాఫీ పొందిన రైతులు 37 లక్షలు ఉన్నారని చెప్పారు. అప్పుడు రుణమాఫీ కోసం రూ.19,198 కోట్లు తమ ప్రభుత్వ విడుదల చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రైతు రుణమాఫీ జాబితా నుంచి ఎంతో మందిని తొలగించిందంటూ ఆరోపించారు. రూ.2లక్షల వరకు ఉన్న పంట రుణాలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ . అలాగే అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందించాలనీ.. లేదంటే ఆందోళనలు చేస్తామంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story