పొడతూర్పు జాతికి.. జాతీయ గుర్తింపు
By అంజి Published on 20 Feb 2020 12:04 PM ISTనల్గొండ: తెలంగాణలోని నల్లమల పశువులకు జాతీయ గుర్తింపు లభించింది. నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో అధికంగా కనిపించే పొడ తూర్పు జాతి పశువులను అరుదైనవిగా గుర్తిస్తూ జాతీయ పశు జన్యు వనరుల మండలి ప్రకటించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి.. భారత్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రత్యేకతలు కలిగిన ఉన్న పశువులు, కోళ్లజాతులను గుర్తిస్తుంది. దేశ్యవ్యాప్తంగా ఇప్పటివరకూ 197 జాతులను అరుదైన వాటిగా గుర్తించారు.
ఇందులో 50 రకాల పశువులు, 17 దున్నపోతులు, 44 గొర్రెలు, 7 గుర్రాలు, 9 ఒంటెలు, 10 పందులు, 19 కోళ్లు, మూడు రకాల బాతులు ఉన్నాయి. నాగర్కర్నూలు జిల్లాలోని తూర్పు జాతి పశువులపై తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే.. వాటి ప్రత్యేకతలను తెలియజేస్తూ.. వాటిని దేశీయ జాతి పశువులుగా గుర్తించాలని ఐసీఏఆర్కు రాష్ట్రపశుసంవర్థక శాఖ ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఈ ప్రతిపాదనలపై జాతీయ కమిటీ చర్చించి.. ఆమోదించింది. దీంతో పొడ తూర్పు జాతి పశువులకు ప్రత్యేక గుర్తించి లభించినట్లైంది.
రాజేంద్రనగర్లోని జాతీయ కోళ్ల పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన వనరాజ కోడికి సైతం జాతీయ గుర్తింపు లభించింది. ఈ కోడి ప్రతి సంవత్సరం 215 గుడ్లు పెడుతుంది. వనరాజ కోడిని 40 వారాల పాటు పెంచితే 3.5 కిలోల బరువు పెరుగుతాయి.