కివీస్ను వదలని గాయాలు.. భారత్ తో వన్డే సిరీస్ కు జట్టు ఎంపిక
By Newsmeter.Network Published on 30 Jan 2020 8:21 AM GMT
అసలే టీ20 సిరీస్ కోల్పోయి భాదల్లో ఉన్న కివీస్ కు ఇప్పట్లో ఊరట లభించేటట్లు లేదు. టీమిండియాతో టీ20 సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ త్రయం ట్రెంట్ బౌల్ట్,లూకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్నీలు ఇంకా కోలుకోలేదు. దీంతో వన్డేల్లోనూ వీరి సేవలు కివీస్ కోల్పోనుంది. మొదటగా వన్డే సిరీస్ సమయానికి వీరు కోలుకోని అందుబాటులోకి వస్తారని అనుకున్నారు. అయితే వీరు గాయాలనుంచి ఇంకా కోలుకోలేదు. వీరి గాయాలు మానడానికి మరికొంత సమయం పడుతుందని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.
టీమ్ఇండియాతో వన్డే సిరీస్కు యువ పేసర్లతో కూడిన జట్టును ప్రకటించింది. చాలాకాలం తర్వాత స్కాట్ కుగులీన్, హమిష్ బెన్నెట్ వన్డేల్లో చోటు దక్కింది. వీరిద్దరు 2017లో చివరి సారి వన్డేలు ఆడారు. జిమిసన్ తొలిసారి న్యూజిలాండ్ నుంచి పిలుపు అందుకున్నాడు. చివరి రెండు టీ20ల్లో చోటు దక్కని ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్కు వన్డేల్లో చోటిచ్చారు. జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్ ఆల్రౌండర్ సేవలు అందించనున్నారు.
పటిష్ఠమైన కోహ్లీసేనతో ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్, బౌలర్లు సమష్టిగా ఆడాలని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ అంటున్నారు. 2019 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 5 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్ హామిల్టన్లో జరగనుంది.
న్యూజిలాండ్ జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హమిష్ బెన్నెట్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మార్టిన్ గప్తిల్, టామ్ బ్లండెల్, కైల్ జేమిసన్, స్కాట్ కుగులీన్, టామ్ లేథమ్, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ