నిర్భయ కేసు: దోషి వినయ్ శర్మ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
By సుభాష్ Published on 14 Feb 2020 11:31 AM GMTనిర్భయ దోషులకు ఉరిశిక్ష పడినా.. శిక్ష అమలు కాకుండా ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఉరి వేసేందుకు కోర్టు తేదీని ఖరారు చేసినా క్షమాభిక్ష పిటిషన్ కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడంతో, చాలెంజ్ చేస్తూ వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జైల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా వినయ్ శర్మ మానసిక స్థితి సరిగ్గా లేదని, క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ విషయాన్నిరాష్ట్రపతి పరిగణలోకి తీసుకోలేదని అతని తరపున లాయర్ వాదించారు. వినయ్ శర్మ మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి మెడికల్ రికార్డులు రాష్ట్రపతి వద్దకు రాలేదని కోర్టుకు తెలిపారు.
కాగా, లాయర్ వాదనలను కేంద్రం తోసి పుచ్చింది. వినయ్ శర్మ మానసిక స్థితి సరిగ్గానే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 12 నాటి మెడికల్ రికార్డుల ప్రకారం ఆయన ఆరోగ్య స్థితికి ఇబ్బంది ఏమి లేదని కేంద్రం తరపున లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్ పిటిషన్ను కొట్టివేసింది. ఉరిశిక్షను అమలు చేసేందుకు దోషులకు రెండు సార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ, శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.