బ్రేకింగ్: నిర్భయ దోషులకు ఉరి.. ముచ్చటగా మూడోసారి ముహూర్తం ఖరారు
By సుభాష్ Published on 17 Feb 2020 10:54 AM GMTదేశ వ్యాప్తంగా ఢిల్లీలో సంచలన సృష్టించిన నిర్భయ కేసులో కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు డెత్ వారంటీ జారీ చేసింది ఢిల్లీ పటియాల కోర్టు.
కాగా, 2012, డిసెంబర్ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు. ఈ ఘటనలో నిందితులైన, వినయ్, రామ్ సింగ్, అక్షయ్కుమార్, పవన్, ముఖేష్, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్గా భావించి మూడు సంతవ్సరాలపాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.
కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. చివరి ప్రయత్నంగా నిందితులు రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేశారు. కానీ అటువంటి మృగాళ్లను కనికరించవద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రెసిడెంట్ను అభ్యర్థించింది. దీంతో రాష్ట్రపతి కోవింద్ కూడా క్షమాభిక్ష పిటీషన్ను తిరస్కరించడంతో ఉరిశిక్ష ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ.. ఇంతవరకూ దానిపై క్లారిటీ రాలేదు. నిర్భయ తల్లిదండ్రులు ఈ ఘటనపై ఏడేళ్లు పోరాటం చేస్తున్నా.. తమకు న్యాయం ఇంత వరకు జరగలేదని ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉరిశిక్ష వాయిదా పడగా, మరోసారి ఉరిశిక్షను ఖరారు చేస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది.