చైనాలో మరో కొత్త వైరస్.. జాగ్రత్తగా ఉండకుంటే కరోనా కంటే డేంజర్..!
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2020 7:51 AM GMTచైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,83,280 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 7,11,313 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి మందును కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
ఇదిలా ఉంటే.. చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే ఏడుగురు మరణించగా.. 60 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబుల్ టైమ్స్ స్థానిక వార్తా పత్రికలను ఉటంకిస్తూ ప్రచారం చేసింది. ఈ మహమ్మారి మనషులకు వ్యాపించే అవకాశం ఉందని ప్రకటించింది. చైనాలోని జియాంగ్ ను ప్రావిన్స్ లో ఈ ఏడాది జూలై నెలలో ఎస్ఎఫ్టీఎస్ వైరస్ సుమారు 37 మందికి సోకింది. ఆ తరువాత తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్లో 23 మంది సోకినట్లు తెలిపింది.
రాజధాని నాన్ జియాంగ్కు చెందిన ఓ మహిళకు ఈ ఎస్ఎఫ్టీఎస్ వైరస్ సోకింది. ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి. అంతేగాక, ఆమె శరీరంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినట్లు వైద్యం అందించిన డాక్టర్లు తెలిపారు. కాగా, నెల రోజుల చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. ఇప్పటి వరకు చైనాలోని అన్ హుయి, జియాంగ్ సు ప్రావిన్స్ లో ఈ వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు.
అయితే.. ఈ వైరస్ కొత్తది కాదన్నారు. 2011లోనే ఈ వైరస్ ప్రభావం చైనాలో ఉందట. అంతేకాదు.. కరోనా మాదిరిగానే.. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుందని.. అంతేకాదు.. కీటకాలు కుట్టడం ద్వారి కూడా ఈ వైరస్ సోకుందని తెలిపారు.