నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేదని ఆగిపోయిన ట్రైన్
పాట్నా-కోటా ఎక్స్ప్రెస్ రైలు మే మూడో తేదీన ఉడిమోర్ జంక్షన్కు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 2:52 AM GMTనిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేదని ఆగిపోయిన ట్రైన్
రైల్వే స్టేషన్లోకి వచ్చిన రైలు ఆగింది. ఇక కాసేపట్లో బయల్దేరాల్సి ఉంది. కానీ.. స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి సిగ్నల్ అందలేదు. దాంతో.. ట్రైల్ లోకో పైలట్లు కూడా మరో రైలు వస్తుందేమో అనుకుని ట్రైన్ను స్టేషన్లోనే ఆపారు. అలా అరగంటకు పైగా ట్రైన్ను స్టేషన్నే ఆపేశారు. చివరకు సిగ్నల్ ఎందుకు పడలేదనే విషయం తెలుసుకుని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
పాట్నా-కోటా ఎక్స్ప్రెస్ రైలు మే మూడో తేదీన ఉడిమోర్ జంక్షన్కు చేరుకుంది. ఇక అక్కడ కాసేపు ఆగిన ట్రైన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది. కానీ.. స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదు. అక్కడున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే నిద్రపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఇక స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదురు రైలు లోకో పైలట్లు పలుమార్లు హారన్ కూడా మోగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. స్టేషన్ గాఢ నిద్రలోకి జారుకోవడంతో పాట్నా ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు ఉడిమోర్ జంక్షన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు అప్పటికే రైలు ఎక్కి కూర్చొన్న ప్రయాణికులు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు విషయం తెలుసుకున్నాక సదురు రైల్వే స్టేషన్ మాస్టర్ను తిట్టుకున్నారు.
ఇక విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యంగా ఉండటాన్ని డివిజన్ రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సదురు స్టేషన్ మాస్టర్ను ఆదేశించారు. ఇక త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనీ.. ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా.. మరోవైపు స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షమాపణలు కూడా కోరాడని సంబంధిత వర్గాలు చెప్పాయి.