Pune Accident Case: మద్యం తాగేసి ఉన్నా..నాకేం గుర్తులేదు: మైనర్
పుణెలో ఇటీవల జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:53 AM IST
Pune Accident Case: మద్యం తాగేసి ఉన్నా..నాకేం గుర్తులేదు: మైనర్
పుణెలో ఇటీవల జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మైనర్ బాలుడు నిందితుడుగా ఉన్నాడు. అతడిని కేసు నుంచి తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేయడంతో.. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఇద్దరు వైద్యులను కూడా అరెస్ట్ చేశారు. ఇక మైనర్ తల్లిని కూడా పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసు గురించి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు.
కారు యాక్సిడెంట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మైనర్ను విచారించినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం తాగేసి ఉన్నాననీ ఒప్పుకున్నట్లు చెప్పారు. మద్యం తాగడం వల్ల తకేమీ గుర్తు లేదని విచారణలో బాలుడు చెప్పినట్లు తెలిపారు పోలీసులు. మైనర్ బాలుడిని దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి ముందు అతను ఉన్న లొకేషన్ గురించి అడిగామని పోలీసులు చెప్పారు. పబ్లో ఉన్నారా? కారు డ్రైవ్ చేశారా? ప్రమాదానికి సంబంధించి వివరాలను.. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడం గురించి అడిగామన్నారు. ఏది అడిగినా ఒకే సమాధానం చెబుతున్నాడని పోలీసులు అన్నారు. ఏం గుర్తులేదు.. అప్పుడు తాగి ఉన్నానని మాత్రమే బాలుడు అంటున్నాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
కాగా.. మైనర్ బాలుడు, అతని స్నేహితులతో కలిసి రెండు పబ్బుల్లో రూ.48వేల వరకు ఖర్చు చేసి మద్యం సేవించినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. పోర్షె కారు యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన మైనర్ బాలుడి తల్లిదండ్రులను జూన్ 5వ తేదీ వరకు పెణె కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.