సోషల్ మీడియాలో ట్రోల్స్‌.. వ్యర్థాలను సేకరించే వృద్ధుడు ఆత్మహత్య

సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ వీడియోలో కనిపిస్తాయి. మనం కాసేపు చూసుకుని.. ఏదో ఒక కామెంట్‌ పెట్టి మర్చిపోతాం.

By Srikanth Gundamalla  Published on  25 Jun 2024 2:15 AM GMT
old man, suicide, social media, trolling,

సోషల్ మీడియాలో ట్రోల్స్‌.. వ్యర్థాలను సేకరించే వృద్ధుడు ఆత్మహత్య 

సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ వీడియోలో కనిపిస్తాయి. మనం కాసేపు చూసుకుని.. ఏదో ఒక కామెంట్‌ పెట్టి మర్చిపోతాం. ఇంకొన్ని అయితే గుర్తుపెట్టుకుని షేర్‌ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల లైఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదు కానీ.. వైరల్‌ వీడియోలో ఉన్నవారిని మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఇలా ట్రోలింగ్‌కు గురై కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మరికొందరు ఇప్పటికీ వాటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా వ్యర్ధాలను సేకరించే ఓ వృద్ధుడు కూడా సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు బలి అయ్యాడు. అవమానంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్ సింగ్‌ అనే వృద్ధుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను సేకరించి అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఆయన వ్యర్థాలను హ్యాండ్‌ కార్ట్‌లో వేసుకుని వెళ్తూఉండేవాడు. తన గ్రామంలో ప్రతాప్‌ సింగ్‌ అందరికీ సుపరిచితుడే. దాంతో..ఆయన్ని అందరూ బాబాజీ అని పిలిచేవారు. ఈ క్రమంలోనే లొహావత్ గ్రామంలో ఉన్న కొందరు యువకులు అతన్ని వీడియో తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంత మంది యువకులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లుగా కనిపించింది.

దాంతో... వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనని ఎగతాళి చేసిన వీడియోల పట్ల వృద్ధుడు తీవ్ర మనస్థాపం చెందాడు. చివరకు ఉరు పక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం, అవమానించడం.. ట్రోల్ కారణంగానే ప్రతాప్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story