Odisha Train Tragedy: గుర్తుతెలియని 28 మృతదేహాలకు అంత్యక్రియలు
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో ఇప్పటికీ 28 మృతదేహాలు ఎవరివి అనేది తెలియలేదు.
By - Srikanth Gundamalla |
Odisha Train Tragedy: గుర్తుతెలియని 28 మృతదేహాలకు అంత్యక్రియలు
భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత గోరప్రమాదాల్లో ఒకటి ఒడిశా ట్రాజడీ. మూడురైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ దుర్ఘటన జూన్ 2వ తేదీన బహనాగ బజార్ రైల్వే స్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ట్రాజడీ జరిగి నాలుగు నెలలు గడుస్తోంది. అయితే.. ఇప్పటికీ కొన్ని మృతదేహాలు ఎవరివి అనేది గుర్తించలేదు. ప్రమాదం సంభవించిన తర్వాత మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. వాటిలో ఇప్పటికీ 28 మృతదేహాలు ఎవరివి అనేది తేలలేదు.
ఆ 28 మందికి సంబంధించి ఎవరూ ఇప్పటికి వరకు తమ వారని రాకపోవడంతో.. అధికారులే ఆ 28 డెడ్బాడీస్కు అంత్యక్రియలు నిర్వహించనున్టన్లు ప్రకటించారు. చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎవరనేది గుర్తు తెలియకపోవడంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ 28 మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను కార్పొరేషన్కు అప్పగిస్తామని.. వాటికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీఎంసీ అధికారులు తెలిపారు. అయితే.. అంత్యక్రియల మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నట్లు కూడా తెలిపారు.
రైలు ప్రమాద సంఘటన జరిగిన తర్వాత భువనేశ్వర్ ఎయిమ్స్కు 162 మృతదేహాలు వెళ్లాయి. అందులో మొదటి దశలో 81 డెడ్బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షల ద్వారా 53 మృతదేహాలను గుర్తించి వారివారి కుటుంబ సభ్యులకు అందజేసిన విషయం తెలిసిందే. కానీ.. 28 మృతహాలు ఎవరివి అనేది మాత్రం 4 నెలలు అయినా గుర్తించలేకపోయారు. దాంతో.. డెడ్బాడీస్ను డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో పెట్టి ఇన్నాళ్లు భద్రపరిచారు. ఎవరూ మృతదేహాల కోసం రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.