ఆకాశంలో డ్రోన్లు కనిపించడంతో అలర్ట్.. ఎయిర్‌పోర్టు క్లోజ్

మణిపూర్‌లోని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఆకాశంలో గుర్తు తెలియని డ్రోన్లు కలకలం రేపాయి.

By Srikanth Gundamalla  Published on  19 Nov 2023 3:05 PM GMT
manipur, imphal, airport, closed,   drones,

ఆకాశంలో డ్రోన్లు కనిపించడంతో అలర్ట్.. ఎయిర్‌పోర్టు క్లోజ్

మణిపూర్‌లోని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఆకాశంలో గుర్తు తెలియని డ్రోన్లు కలకలం రేపాయి. ఎయిర్‌ వద్ద ఆకాశంలో కొన్ని డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. బిర్‌ టికేంద్రజిత్‌ అంతర్జాతీయ విమనాశ్రయం వద్ద డ్రోన్లు కనిపించడంతో విమానాలను రద్దు చేశారు అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో డ్రోన్లును గుర్తించామని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. టేకాఫ్‌ అవ్వాల్సిన విమానాలే కాదు.. ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం అధికారులు ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.

మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇంకొందరు గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా శాంతిభద్రతలు అదుపులోకి రాలేదు. దాంతో.. అక్కడ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని విధించింది. నవంబర్‌ 23 వరకు ఇంటర్నెట్‌ సేవలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద డ్రోన్లు ఎగిరిన ఘటన కలకలం రేపింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్‌పోర్టును అధికారులు క్లోజ్‌ చేశారు. దాంతో.. అప్పటికే విమానశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు.

ఈ సంవత్సరం మే 3వ తేదీ నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఈ ఘర్షణల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేయడంతో 50వేల మంది నిరాశ్రయులు అయ్యారు. మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. అప్పట్నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Next Story