అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  25 May 2024 2:00 PM GMT
kashmir, car accident, four people died,

 అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం 

కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుల్గామ్‌ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న టూరిస్ట్‌ వాహనం అదుపుతప్పింది. దాంతో.. కారు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందనీ.. చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

ఈ రోడ్డు ప్రమాదం కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చనిపోయిన నలుగురూ కూడా పంజాబ్‌ వాసులుగా పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిపోరా ప్రాంతంలోని గ్రిడ్‌ స్టేషన్‌ దగ్గర ఖాజీగుండ్‌ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పింది. దాంతో.. డ్రైవర్‌ నియంత్రణ కల్పోవడంతో బోల్తా కొట్టింది. పల్టీలు కొడుతూ రహదారి పక్కకు పడిపోయింది. ఈ సంఘటనలో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉండగా.. నలుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నామనీ.. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. ఇక గాయపడ్డ ముగ్గురి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిసింది.

ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. మృతులంతా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సందీప్‌ శర్మ (28), రోమి (26), జగదీశ్‌ అలియా హనీ (23), గుర్మీత్ సింగ్ (23)గా చెప్పారు. గాయపడ్డ వారు హర్‌చంద్‌ సింగ్ (34), కరణ్‌పాల్‌ (25), అషు (18)గా చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Next Story