ఇవాళే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ఆదివారమే వెల్లడించనుంది.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 1:03 AM GMT
himachal pradesh, sikkim, assembly election results,

ఇవాళే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలకు ముందే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ఆదివారమే వెల్లడించనుంది.

ఆరు గంటల నుంచే ఓట్ల లెక్కింప ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 10 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపును సొంతం చేసుకుంది. ఇప్పుడు మిగిలిన 50 అసెంబ్లీ స్ స్థానాలకే లెక్కింపు కొనసాగనుంది. దాంతో.. ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ్టితో తేలనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చాలా తక్కువ స్థానాలే కావడం వల్ల మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెల్లడి అవుతాయని ఆ రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్ పవన్‌ కుమార్‌ సైన్‌ చెప్పారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

మరోవైపు సిక్కిం రాష్ట్రంలో కూడా ఆదివారమే అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. సిక్కింలో కూడా తక్కువ అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక్కడ అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశతో ఉంది. ఎలాగైనా తామే విజయం సాధిస్తామని దీమాగా ఉంది. మరోవైపు తాము ఈసారి అధికారంలోకి వస్తామని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ-సిక్కిం చెబుతున్నాయి. ఎవరికి వారు తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. కాగా.. సిక్కింలో ఏప్రిల్ 19వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 80 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

Next Story