దేశ రాజధానిలో వీటిపై బ్యాన్
Heavy security in Delhi-NCR as R-Day near amidst terror fears.గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ
By M.S.R
గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి నిఘా ఏజెన్సీలకు హెచ్చరిక అందింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఈ మేరకు జాతీయ దినపత్రికలు కథనాలు వెల్లడించాయి. రద్దీ ప్రదేశాలు, కీలక కట్టడాలు, ప్రజల సమూహాలు లక్ష్యంగా కూడా ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్కు వచ్చిన రిపోర్ట్లో తెలిసింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని నిఘా వర్గాలు సూచించాయి.
జనవరి 20 నుండి ఢిల్లీలో డ్రోన్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడర్లు ఎగరడాన్ని నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. పారా-గ్లైడర్లు, పారా-మోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), మానవరహిత విమాన వ్యవస్థలు (UASలు), మైక్రో-లైట్ ఎయిర్క్రాఫ్ట్, రిమోట్గా పైలట్ చేయబడిన విమానం, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న సైజు పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్, క్వాడ్కాప్టర్లు, పారా-జంపింగ్ వంటి వాటిని ఫిబ్రవరి 15 వరకు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఢిల్లీ పోలీసులు ముందుజాగ్రత్తగా ఈ చర్యలను చేపట్టారు. రెండు వేర్వేరు ప్రదేశాలలో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు సిబ్బంది కూడా ఎత్తైన భవనాలపై అదనపు నిఘా కోసం మోహరించనున్నారు.