పోలింగ్ డేటాను మార్చడం అసాధ్యం: ఎన్నికల సంఘం
పోలింగ్ శాతాలపై కొందరు తప్పుడు కథనాలను రూపొందిస్తున్నారని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 8:45 PM IST
పోలింగ్ డేటాను మార్చడం అసాధ్యం: ఎన్నికల సంఘం
పోలింగ్ శాతాలపై కొందరు తప్పుడు కథనాలను రూపొందిస్తున్నారని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఒక్కసారి పోలింగ్ అయ్యాక పోలింగ్ డేటాను మార్చడం అసాధ్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల ఐదు దశలకు సంబంధించి సంపూర్ణ పోలింగ్ వివరాలు, ఓటు వేసిన వారి పూర్తి శాతాలను ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. మొదటి ఐదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా మొత్తం పోలైన ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను ఎన్నికల కమిషన్ తమ వెబ్సైట్ ఉంచింది. పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని ఈసీ స్పష్టంగా మరోసారి చెప్పింది. ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే.. పోలింగ్ పూర్తయిన వెంటనే 48 గంటల్లోగా ప్రతీ పోలింగ్ కేంద్రం వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో ఉంచాలని కోరుతూ.. సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసిందనీ.. ఈ క్రమంలో ఈసీకి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోత్తర న్యాయస్థానం చెప్పింది. కాగా.. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. సుప్రీంకోర్టులో వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఈ క్రమంలోనే ఐదు దశలకు సంబంధించి గణాంకాలను వెబ్సైట్లో ఉంచింది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు ‘ఓటర్ టర్నవుట్’ డేటా ఫార్మాట్ను మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు ఎలక్షన్ కమిసన్ తెలిపింది. మొత్తం ఓటర్ల సంఖ్య, నమోదైన పోలింగ్ శాతం ద్వారా ఎంతమంది ఓటేశారనేది తెలుసుకోవచ్చని పేర్కొంది.
Commission releases absolute number of voters for all completed phases of General Elections 2024Details :https://t.co/z0QVHGM41Z
— Spokesperson ECI (@SpokespersonECI) May 25, 2024