ముందుగా కరోనా వ్యాక్సిన్‌ వారికే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

Corona vaccine in February.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సి

By సుభాష్  Published on  23 Nov 2020 3:11 PM GMT
ముందుగా కరోనా వ్యాక్సిన్‌ వారికే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత్‌తో పాటు ఎన్నో దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్‌ ఫలితాలు ప్రకటిస్తుండగా, తాజాగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వ్యాక్సిన్‌ రాగానే ముందుగా ఎవరికి ఇవ్వబోతున్నామనే విషయాన్ని ప్రకటించారు.

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామని అన్నారు. వ్యాక్సిన్‌ను కరోనా వైరస్‌ కార్మికులు, పోలీసు అధికారులు, పారా మిలటరీ బలగాలకు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత 65 ఏళ్లుపైబడిన వారికి టీకా ఇస్తామన్నారు. అప్పుడు 50 ఏళ్లుపైబడిన వ్యక్తులకు, ఇప్పటికే వివిధ వ్యాధులు ఉన్న రోగులకు ఇవ్వనున్నట్లు చెప్పారు.

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్‌ పెద్ద సంఖ్యలో కోవిడ్‌ వ్యాక్సిన్లను అందుకునే అవకాశం ఉందని అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా డెవలప్‌ చేసే కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత ప్రభుత్వం పుణేకు చెందిన సీరం ఇన్స్‌స్టిట్యూ్‌ ఆఫ్‌ ఇండియాకు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఒకటి, రెండో దశల పరీక్షల డేటాను సమర్పించిన తర్వాత భారత్‌ బయోటెక్‌ సహా అన్ని కంపెనీలు వ్యాక్సిన్‌కు సంబంధించి అత్యవసర అనుమతులను పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కోసం డేటాను ప్రచురించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడది మూడో దశలో ఉంది. ఫిబ్రవరి నాటికి రెండు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021 సెప్టెంబర్‌ నాటికి దేశంలో 25 నుంచి 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉందని కేంద్రం మంత్రి వెల్లడించారు.

Next Story