అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..!

ఆధార్‌ కార్డు, విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు పాస్‌పోర్ట్‌, వివాహాల నమోదుకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటి ఉంటే చాలు.

By -  Srikanth Gundamalla
Published on : 15 Sept 2023 4:43 PM IST

Birth Certificate, Single document, oct 1st,

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..!

కేంద్రం తీసుకొచ్చిన జనన మరణాల నమోదు చట్టం, 2023 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు, విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు పాస్‌పోర్ట్‌, వివాహాల నమోదుకు ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటే అందిస్తే సరిపోతుంది. ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆగస్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.

అయితే.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ లేదంటే ఆ తర్వాత జన్మించిన వారికి బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది. విద్యా సంస్థల్లో ప్రవేశం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ, ఓటరు నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకూ ఈ బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చని కేంద్రం నోటిఫికేషన్‌లో తెలిపింది.

జనన, మరణాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో డేటా బేస్‌ ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ సేవలు, సామాజిక పథకాలు, డిజిటల్‌ రిజిస్ట్రేషన్ల విషయంలో పారదర్శకతకు వీలు పడుతుందని తెలిపింది. ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రజల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి పుట్టిన తేదీ, ప్రదేశాన్ని వివరాలను ఒకే పత్రంలో సమర్పించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోందని కేంద్రం చెబుతోంది. దత్తత తీసుకున్న, అనాథ, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు, సరోగేట్‌ పిల్లల నమోదు ప్రక్రియను ఈ చట్టం సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది.

Next Story