ప్యాసెంజర్ రైళ్లు వచ్చేస్తున్నాయి

All train services under SCR to be restored in few months.భారత్ లో ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న వాటిలో రైల్వేల

By M.S.R  Published on  7 Oct 2021 2:15 PM GMT
ప్యాసెంజర్ రైళ్లు వచ్చేస్తున్నాయి

భారత్ లో ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న వాటిలో రైల్వేల భాగస్వామ్యం ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇండియన్ రైల్వే కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. తాజాగా రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ప్రకటించారు. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా.. మళ్లీ మొదలుపెట్టడానికి సిద్ధమవుతూ ఉంది. మౌలాలి నుంచి సనత్‌నగర్‌ వరకు డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో 55 ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైళ్లు నడుస్తున్నాయని.. త్వరలోనే మరో 30 సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపారు. రైళ్లలోప్రయాణించే వారు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి సూచించారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున రైల్వే స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ కఠినంగా అమలు చేయనున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటన చేసింది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన అర్హత కలిగిన నాన్ గెజిగెట్ ఉద్యోగులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ బోనస్ వర్తిస్తుంది. అయితే ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం వల్ల దాదాపు 11.56 లక్షల మంది నాన్ గెజిగెట్ రైల్వే సిబ్బంది ప్రయోజనం పొందనున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కమిటీ 72 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ను సూచించిందని, అయితే ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాయని ఆయన తెలిపారు. రైల్వే ఉద్యోగుల బోనస్ ప్రకటన వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.1985 కోట్ల భారం పడనుంది.

Next Story