విజయవాడ: తెరుచుకున్న మల్టిప్లెక్స్‌

By సుభాష్  Published on  1 Nov 2020 9:04 AM GMT
విజయవాడ: తెరుచుకున్న మల్టిప్లెక్స్‌

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఎనిమిది నెలలుగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగం సైతం మూతపడింది. థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇక తాజాగా విజయవాడలో ఆదివారం నుంచి మల్టిప్లెక్స్‌ల్లో సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా కాకుండా రోజుకు కేవలం మూడు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే టికెట్‌ కౌంటర్లు కూడా కేవలం రెండు గంటల ముందు ఓపెన్‌ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ మల్టిప్లెక్స్‌లను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఆదివారం నుంచి సినిమాలు ప్రారంభమయ్యాయి.

కరోనా నేపథ్యంలో మార్చి 15న మూతపడిన మల్టిప్లెక్స్‌ థియేటర్లు ఎట్టకేలకు ఆ రోజు నుంచి తెరుచుకున్నాయి. అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్రం సూచించిన మార్గదర్శకాల ప్రకారం కేవలం 50శాతం సీట్లకు మాత్రమే టికెట్లను విక్రయించనున్నారు. రెండు గటల ముందు మాత్రమే బాక్సాఫీసులు తెరిచి టికెట్లను జారీ చేయనున్నారు. అలాగే క్యాష్‌ లెస్‌ ట్రాన్సక్షన్‌, పేపర్‌ లెస్‌ టికెట్లతో నడపనున్నారు.

అలాగే సినిమాను చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కు ధరించాల్సి ఉంటుంది. ఈ మేరకు థియేటర్ల యాజమాన్యం సైతం అన్ని చర్యలు చేపట్టింది. మాస్కులు లేనివారికి అనుమతించడం లేదు. అలాగే ప్రేక్షకులకు మాస్కులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు కూడా చేశారు.

Next Story