సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ.. పూజలందుకోవాలే గానీ.. మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 7:53 AM GMT
సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ.. పూజలందుకోవాలే గానీ.. మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో కాపుల రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. రిజర్వేషన్ల పోరాటానికి గతంలో మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, రాజశేఖరరెడ్డి మాదిరి పూజలు అందుకోవాలని గానీ.. పదవిని మూన్నాళ్లముచ్చట చేసుకోవద్దని కోరారు. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎంను లేఖలో కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ తో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై తేల్చాలన్నారు.

" మీరు అడిగిన వారికి, అగడని వారికి, హామీలు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాలు చేసి దాన కర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకాల కోరిక పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ పూర్తి మద్దత్తు ఇచ్చారు. 1-12-2016 రాత్రి మీడియాకు మీరు ఇంటర్వూ ఇచ్చి మా జాతి కోరిక సమంజసం అని చెప్పారని మిత్రులు చెబితే విన్నాను. అసెంబ్లీలో కూడా మద్దత్తు ఇచ్చారని విన్నాను. ఈ రోజు మా కోరికను దానం చేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదండి.

మీ విజయానికి మాజాతి సహాకారం కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్లా మీరు పొందలేదా..? ఎన్నికలు జరిగిన అన్ని రోజులలో ఇంచుమించుగా ప్రతీ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు మా జాతిని, ఉద్యమాన్ని, పోలీసులతో చేయించిన దమనకాండ, అరాచకాలు, అవమానాలు మీ చానెల్‌లో చూపించిందే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొందలేదా ముఖ్యమంత్రి గారు..?

పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలు పంచుకోవాలి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గారు. అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు, అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి రాజశేఖర రెడడి గారు లాగ పూజలందుకోవాలే గాని పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి. ముఖ్యమంత్రి గారు దయచేసి మా జాతి సమస్య తీర్చమని భారత ప్రధాని మోదీ గారిని కోరమని మిమ్మలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో కోరారు.

Untitled 7 Copy

Next Story