బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూవీ ప్రారంభం
By Newsmeter.Network Published on 6 Dec 2019 11:47 AM GMT‘సింహా’. ‘లెజెండ్' లాంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి ప్రొడక్షన్ నెం.౩ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ లోనే నటసింహ నందమూరి బాలకృష్ణ ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’అనే పవర్ఫుల్ డైలాగ్ను తనదైన స్టైల్లో చెప్పడం విశేషం.
ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - “ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న.. నా మరియు బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా నూతన చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను కాంబినేషన్లో ’సింహా’, ’లెజెండ్' సినిమాలు చేయడం, అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అయితే నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ మా నెక్స్ట్ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం.రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే ’సింహా’, ’లెజెండ్' సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. ఇండస్ట్రీకి మిర్యాల రవీందర్లాంటి మంచి మంచి యంగ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు.