ఇకపై దోమకు దోమే శత్రువు
By సుభాష్
ముల్లును ముల్లుతోనే తియ్యాలి, దోమను దోమతోనే సంహరించాలి అంటున్నారు శాస్త్రవేత్తలు. డెంగీ, మలేరియా వంటి వైరస్లను వ్యాప్తి చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న దోమల అంతానికి ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. వాటి సంహారానికి మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలను జన్యు ఇంజినీరింగ్ విధానంలో సృష్టించారు. డెంగీ వైరస్కు లొంగని విధంగా దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటియాగో, వ్యాండర్బిల్ట్ వర్సిటీల శాస్త్రవేత్తలు.
మన పరిసర ప్రాంతాల్లోనే నివసించే ఆడ ఏడిస్ ఏజిప్టి దోమలతో డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని నిర్ములన కోసం ‘కార్గో’ అనే మనుషుల యాంటీబాడీని దోమల్లోకి చొప్పించారు. దీంతో వాటి శరీరంలో అది క్రియాశీలమై, డెంగీ వైరస్లు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు గుర్తించారు. ఈ కొత్త రకం దోమలు.. ఒకవేళ డెంగీ రోగుల రక్తాన్ని పీల్చితే, వాటిలోని మానవ యాంటీబాడీ క్రియాశీలకంగా మారి వైరస్ ప్రభావానికి లొంగకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్లను కూడా అడ్డుకునే దిశగా ఈ పరిశోధన కీలకం కానుంది.
సాధారణంగా డెంగీ రోగులను దోమ కుట్టినప్పుడు, దానిలోకి డెంగీ వైరస్ ప్రవేశిస్తుంది. మళ్లీ అదే దోమ ఆరోగ్యవంతులైన వ్యక్తులను కుడితే వారికీ డెంగీ సోకుతుంది. ఇలా డెంగీ వ్యాప్తి చెందుతుంది. డెంగీ రోగులను దోమ కుట్టినప్పటికీ అది వైరస్ బారినపడకుండా ఉండగలిగేలా దోమల్లో మార్పులు చేయాలన్న ఆలోచనతో ఈ కొత్త దోమలను సృష్టించాం అంటున్నారు పరిశోధకులు. దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈ పద్ధతితో అడ్డుకోవచ్చునని అంచనా.
ఏడిస్ దోమ మన ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంది. పూలకుండీలు, ఎయిర్కూలర్లు, పాతటైర్లు, పాత ఖాళీడబ్బాల వంటి వాటిలో చేరే నీరు ఈ దోమకు అనుకూలం. మన పరిసరాలు అపరిశుభ్రంగా పెట్టుకుని దానికి అనుకూలమైన పరిస్థితులు మనమే కల్పిస్తాం. ఈ జాతి దోమ రాత్రిపూట కాకుండా సూర్యోదయ, సూర్యాస్తమయాల్లోనే తిరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో దోమకాటు నుంచి రక్షించుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ సమస్య కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఆసియా, లాటిన్ అమెరికాల్లో ఈ వ్యాధి కారణంగా చాలామంది పసిపిల్లలు మరణిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోగా, దానిని నియంత్రిస్తూ వేచి ఉండటమే ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతి.