త్వరలో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకి డబ్బులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 11:40 AM GMT
త్వరలో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకి డబ్బులు..!

ముఖ్యాంశాలు

  • సీఎం జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకి చెక్కులు
  • ఈ నెల 7 గుంటూరులో చెక్కులు పంపిణీ కార్యక్రమం
  • మొదటి విడతగా రూ.264 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ నెల 7న గుంటూరులో చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మొదటి విడతగా రూ.264 కోట్లు విడుదల చేయడంతో తగిన చర్యలు చేపట్టాలని సీఐడీ అధికారులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. విజయవాడ కేంద్రంగా వెలసిన అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని 19.19 లక్షల మందితో రూ.6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించింది.

కాల పరిమితి ముగిసిన బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఇతర ముఖ్యులను అరెస్టు చేసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని రూ.3,785 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. అత్యధికంగా మన రాష్ట్రంలో రూ.2,585 కోట్ల విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సీఐడీ మొదలు పెట్టింది. డిపాజిటర్లు ఆందోళనకు దిగడంతో గత ప్రభుత్వం రూ.250కోట్లు ఇచ్చి రూ.5వేల లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు యత్నించింది. ఎన్నికల తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో సీఐడీ అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు అందజేశారు.

ఆ జాబితాను న్యాయకమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బు పంపిణీ చేయబోతున్నారు.

Next Story