పెట్టుబడులకు భారత్ స్వర్గధామం: పీఎం మోదీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2019 3:41 PM GMTముఖ్యాంశాలు
- ఆసియా దేశాలతో విస్తృత చర్చలు
- భారత్ - థాయ్ లాండ్ బంధంపై చర్చ
- అంగ్ సాన్ సూకీతో భేటీ
ఆసియాన్ దేశాలు, వాటి వాణిజ్య భాగస్వామ్య దేశాలతో స్వేచ్చా వాణిజ్యానికి తలుపులు తెరవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం-RCEP వైపుగా మోదీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఐతే, స్వదేశీ వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా-విదేశీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించేలా విన్-విన్ మోడ్ ఉండాలని బీజేపీ సర్కారు భావి స్తోంది. థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై మరో విడత చర్చలకు సిద్దంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. ఆసియా దేశాలతో విస్తృత స్థాయిలో చర్చలు చేపడతామని చెప్పారు. ఆసియాన్ గ్రూప్తో సహకారం దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఇండియా-ఆసియాన్ సదస్సుకు హాజరయ్యారు. బ్యాంకాక్లో ఆసియాన్ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్లో పెట్టుబడుల అవకాశా లు, వాణిజ్యపరంగా అవసరాలను వివరించారు. వ్యవసాయం, ఇంజినీరింగ్, తీరప్రాంత భద్రత, డిజిటల్ టెక్నాలజీల్లో పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఇండో పసిఫిక్ రీజియన్లో లుక్ ఈస్ట్ పాలసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్తో మోదీ భేటీ అయ్యారు. భారత్-థాయ్లాండ్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, మయన్మార్ నాయకురాలు ఆంగ్సాన్సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు.
అంతకుముందు, ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ భారతదేశం అవతరించాలన్న కల సాకారం చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. స్నేహపూర్వక పన్ను వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో పన్ను చెల్లింపుదారుల పాత్ర చాలా గొప్పదని అభివ ర్ణించారు. సమావేశాలు, చర్చల అనంతరం విందులో పాల్గొన్నారు.