పోలీసులపై దాడులు చేయడం ఇదేనా పద్దతి: మోదీ
By సుభాష్
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు, పోలీసులపై రాళ్లు రువ్వడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న మోదీ ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలమని, ఇదే దేశ ప్రత్యేక అని చెప్పారు. పౌరసత్వ సవరణ విషయంలో భారతీయ ముస్లింలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. దేశంలో ఎన్నోప్రభుత్వాలు మారినా.. పోలీసుల విధుల్లో ఎలాంటి మార్పు ఉండదని, వారి వారి పనితానికి కట్టుబడి ఉంటారన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి భద్రతల కోసం 33 వేల మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని మోదీ గుర్తు చేశారు. ఎల్లప్పుడు శాంతి భధ్రతలను కాపాడే పోలీసు సిబ్బందిపైనే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు విధులు నిర్వహించడమే వారి ధ్యేయమని, ఎండొచ్చినా..వానొచ్చినా.. ఏవి పట్టించుకోరని పేర్కొన్నారు. ఇలా పోలీసులపై దాడులకు దిగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పోలీసులపై దాడులకు దిగడం సరైంది కాదన్నారు.