మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి

By Newsmeter.Network  Published on  9 Feb 2020 1:19 PM GMT
మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి

హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన అమ్మవార్ల ఆలయాలలో.. పాతబస్తీ లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, ఆ ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే లాల్ దర్వాజ బోనాలు.. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం, చాలినంత స్థలం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు.

ఇంకా అక్బరుద్దీన్ గుడి విశిష్టతను వివరిస్తూ.. లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారన్నారు. గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. గణంతో పాటు దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని సీఎంకి విన్నవించారు. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది. అందుకు ప్రత్యామ్నయంగా వారికి జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం.. బంగారు తెలంగాణ కావాలని దీవించాలని కోరుతూ ఈ దేవాలయంలో అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అక్బర్ గుర్తు చేశారు. పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సిఎం కేసీఆర్ ను కోరారు.

అక్బరుద్దీన్ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

Next Story