స్వీయ నిర్భందంలో హీరోయిన్.. ఎందుకంటే..
By తోట వంశీ కుమార్ Published on 18 March 2020 3:28 PM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 8వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే.. భారత్లో కూడా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్గా తేలిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో పలువురు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి కూడా చేరిపోయారు.
'బాజి' షూటింగ్ కోసం లండన్కు వెళ్లిన మిమి చక్రవర్తి మంగళవారం స్వదేశానికి వచ్చారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడంతోపాటు, కరోనా వైరస్కు సంబంధించి ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 7 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మిమి చక్రవర్తి ప్రకటించారు. ‘నేను యూకే నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాను. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంట్లో నన్ను కలవద్దని నా తల్లిదండ్రులకు చెప్పాను. నా తండ్రికి ఇప్పుడు 65 ఏళ్లు. 7 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉన్నాం. కానీ తొందరలోనే ఈ పరిస్థితి మారుతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా శుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రత చర్యల్లో భాగంగా ఇతరులతో దూరంగా మెలగాలి’ అని తెలిపారు.