ట్రంప్ భారత్ పర్యటనపై ముకేశ్ అంబానీ కామెంట్
By అంజి Published on 24 Feb 2020 10:34 AM GMTముంబై: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దశలో భారత్ ఉందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నిర్వహించారు.
కాగా సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడారు. ఈ ప్రభావం పూర్తిగా మొబైల్ నెట్ వర్క్ విపరీతంగా పెరగడం వల్లేనని, గతంలో ఎన్నడూ చూడని విధంగా విస్తరించడం వల్లేనని ముకేశ్ అన్నారు. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఆ తర్వాత జియో 4జీ టెక్నాలజీ వైపు 380 మిలియన్ల మంది ప్రజలు మళ్లారని, ప్రీ జియో డేటా స్పీడ్ 256 కేబీపీఎస్ ఉందన్నారు. పోస్ట్ జియో వేగం 21 ఎంబీపీఎస్తో ఉందని ముకేశ్ అంబానీ వివరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై ముకేశ్ అంబానీ స్పందించారు. 2020లో ట్రంప్ చూసే భారతదేశం గతంలో లాగా ఉండదని, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు చూసినదాని కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. త్వరలోనే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందనేదే చర్చనీయాంశమన్నారు. మన కన్నా.. వచ్చే తరం కొత్త భారతాన్ని చూడబోతుందని అంబానీ అన్నారు.