కీలక ఘట్టానికి చేరుకున్న మేడారం జాతర
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Feb 2020 2:46 PM GMT
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాల నడుమ సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారంకు బయల్దేరింది. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య పాల్గొన్నారు. సమ్మక్కకు దారి పొడవునా లక్షలాది భక్తులు ఎదురేగి.. కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు.
ఇదిలావుంటే.. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెపై కొలువుదీరారు. సారలమ్మతో పాటు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం గద్దెల పైకి చేరారు. వీరి రాకతో మేడారం జాతర అంబరా కనులవిందుగా మారింది. దేవతలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు.