మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్కు కొరత
By అంజి Published on 9 March 2020 9:59 AM GMTదేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో మాస్కులు,హ్యాండ్ వాష్ శానిటైజర్స్కు డిమాండ్ పెరిగింది. జనం వీటి కొనుగోలుకు ఎగబడుతుండటంతో ఇదే అదనుగా కొన్ని సంస్థలు దోపిడీకి తెరలేపాయి. ఇప్పటికే రూ.2 విలువ చేసే మాస్కులను రూ.10 నుంచి పాతిక వరకు అమ్ముతూ పలు మెడికల్ షాపులు సామాన్యులను దోచుకుంటున్నాయి.
ఇక ఆన్లైన్లో హ్యాండ్ వాష్ శానిటైజర్స్ ధరలు అమాంతం 16 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వాటిని ఆర్డర్ చేయాలనుకున్నవినియోగదారులు ఆ ధరలు చూసి ఖంగు తింటున్నారు. హ్యాండ్ శానిటైజర్ల అమ్మకాలు పదింతలు పెరిగాయి. దీనితో మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వస్తుండటంతో కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి.
కరోనా వైరస్ భయం ఇతర దేశాల్లో కూడా లేనిపోని అపోహలను సృష్టించింది. కరోనా వ్యాప్తి ఒక్కసారిగా విజృంభిస్తే.. బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుందో లేదో.. ఒకవేళ వెళ్లినా ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో చాలామంది కిరాణ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో అయితే టాయిలెట్ పేపర్ కట్టల కోసం ఎగబడుతున్న పరిస్థితి. ఎక్కడ అయిపోతాయోనన్న ఆందోళనతో ముందస్తుగా భారీ సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తున్నారు. అమెరికాలోని షాపుల్లో సైతం హ్యాండ్ శానిటైజర్స్, టిష్యు పేపర్లు, టాయిలెట్ పేపర్ల రాక్ లు ఖాళీ గా కనపడుతున్నాయి. ఇదే క్రమంలో భారత్లో హ్యాండ్ శానిటైజర్స్కు డిమాండ్ ఏర్పడింది.