ఆ విషయంపై గళమెత్తినందుకే అచ్చెన్నాయుడుపై అవినీతి మరక: నారా లోకేశ్

By సుభాష్  Published on  21 Feb 2020 12:03 PM GMT
ఆ విషయంపై గళమెత్తినందుకే అచ్చెన్నాయుడుపై అవినీతి మరక: నారా లోకేశ్

బీసీ నిధులపై గళమెత్తినందుకు ఇప్పుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై పడ్డారని నారా లోకేష్‌ మండిపడ్డారు. అచ్చెన్నాయుడుకు అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారని, బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ నిధులను తుగ్లక్‌ పక్కదారి పట్టించారని ఎలుగెత్తినందుకు అచ్చెన్నాయుడును ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అచ్చెన్నాయుడు బీసీల పరిస్థితిపై ప్రశ్నించినందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మందులు, వస్తువుల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు ఎలాంటి లేఖలు రాయలేదని ఆధారాలున్నా.. లీక్‌ వార్తలతో ఏదో సాధించాలనే ఉద్దేశంతో లేనిపోనివి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు లోకేష్‌ ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు.

కాగా, తాజాగా ఏపీ ఈఎస్‌ఐలో జరిగిన భారీ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పేరు బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ అధికారులు రిపోర్టులో వెల్లడించారు. నామినేషన్‌ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాల్లో రూ.కోట్ల కుంభ కోణానికి పాల్పడ్డారని, టెలీ హెల్త్‌ సర్వీసుల పేరుతో ఆర్డర్స్‌ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story